హార్ముజ్‌ను రక్షించడానికి వస్తాం కానీ: డొనాల్డ్ ట్రంప్‌కు చైనా షరతు

  • హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు కలిసి రావాలన్న ట్రంప్
  • పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని చైనా షరతు
  • ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అమెరికాకు సూచన
హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హార్ముజ్ ప్రభావంతో ఇబ్బందిపడుతున్న చైనా సహా వివిధ దేశాలు ముందుకు రావాలని ఆయన సూచించారు. ట్రంప్ విజ్ఞప్తిపై స్పందించిన చైనా ఒక షరతు విధించింది.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న హార్ముజ్‌ను సురక్షితంగా ఉంచేందుకు, ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు తాము ముందుకు వస్తామని, కానీ అంతకంటే ముందు పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని అమెరికాకు చైనా షరతు విధించింది. ఈ ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, శాంతి, ప్రపంచ స్థిరత్వం దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకోవాలని అమెరికాకు సూచించారు. ఘర్షణలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధించగలమని పేర్కొన్నారు. ఈ నెల చివరలో ట్రంప్ బీజింగ్ పర్యటనపై అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

హార్ముజ్ ప్రాంతం మీదుగా అధిక ప్రయోజనాలు పొందుతున్న దేశం చైనాయేనని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆ జలసంధిని రక్షించడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. చైనా నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తన బీజింగ్ పర్యటనపై నిర్ణయం ఉంటుందని అన్నారు. కాగా, ట్రంప్ పిలుపును జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు పట్టించుకోలేదు.

Donald Trump
China
Hormuz Strait
Iran
US Israel conflict
West Asia
Military operations
Oil transport

More Telugu News